జగన్ పార్టీలోకి నల్గొండ టిడిపి నేత సంకినేని: జైల్లో భేటీ
ఆయన ఏ క్షణంలోనైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో సంకినేని వెంకటేశ్వర రావుకు మంచి పట్టు ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి సంకినేని పార్టీ వీడటం జిల్లాలో టిడిపికి గట్టి దెబ్బే అంటున్నారు. సంకినేని ఇప్పటి వరకు అధికారికంగా తాను జగన్ పార్టీలో చేరతానని ప్రకటించనప్పటికీ.. జైలులో ఉన్న జగన్ను కలవడం వైయస్సార్ కాంగ్రెసులో చేరేందుకే అని అంటున్నారు. కాగా, సంకినేని వెంకటేశ్వర రావును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
నా ఎదుగుదల కోసమే.. కృష్ణబాబు
ఏలూరు: తన ఎదుగుదల కోసమే తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు సోమవారం చెప్పారు. తనతో పాటు తన కార్యకర్తలు కూడా జగన్ పార్టీలో చేరతారని చెప్పారు. కాగా కృష్ణబాబు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆయన శుక్రవారం జైలులో జగన్మోహన్రెడ్డితో ములాఖత్ అయినట్టుగా కూడా తెలిసింది. వీరిద్దరి మధ్య 20 నిమిషాలకు పైగానే సంభాషణ సాగింది. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక జరిగే సమయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాజమండ్రి ఎంపీ టికెట్ లేదా రాజ్యసభ టికెట్ ఇవ్వాలనే డిమాండ్లను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అయితే, జగన్ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుకుండానే ఆయన వెళ్లిపోయారు.