కెసిఆర్ వర్సెస్ కోదండ: చల్లారని నిప్పు, రహస్య భేటీ
గతంలో చేపట్టిన మిలీనియం మార్చ్ను వాయిదా వేసుకోవాలని కెసిఆర్ చేసిన సూచనను కోదండరామ్ వినకపోవడంతో దూరాలు పెరిగాయి. ఆ తర్వాత మహబూబ్నగర్ ఉప ఎన్నికలో జెఎసి తటస్థ వైఖరి అవలంబించడంపై కూడా కెసిఆర్కు వ్యతిరేకత పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ మార్చ్ వారిద్దరి మధ్య దూరాన్ని పూడ్చలేనంతగా పెంచిందని అంటున్నారు. తెలంగాణ మార్చ్ వేదిక మీద తెరాసకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా కెసిఆర్ కోదండరామ్పై మండిపడుతున్నట్లు సమాచారం. కెసిఆర్కు, కోదండరామ్కు మధ్య తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జెఎసి హైదరాబాదులో రహస్య భేటీని నిర్వహించింది. కెసిఆర్ అలకను మాన్పడం ఎలా అనే విషయంపైనే సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మార్చ్ ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ను కలిసేందుకు కోదండరామ్తో సహా టీజేఏసీ నేతలు కలిసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ వారికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు రంగంలోకి దిగారు. తెలంగాణ మార్చ్ సమయంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేననీ, ఐతే ఆ తప్పులన్నిటికీ కోదండరామ్ ఒక్కరే బాధ్యులు కారనీ, తాము కూడా బాధ్యత వహించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పుకొచ్చారు. ఎంతమంది నాయకులు చెప్పినప్పటికీ కేసీఆర్ మాత్రం తన పట్టును వీడలేదు. కోదండరామ్ తో చర్చించడానికి ససేమిరా అన్నారు.
కాగా, కెసిఆర్ తెలంగాణ విషయంలో చాలా ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. ఫామ్హౌస్లో ఆయన తనను కలుస్తున్నవారితో తెలంగాణ ప్రకటన రావడం ఖాయమని చెబుతున్నారు. కెసిఆర్తో తమ పార్టీ అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. మొదటి దశ చర్చలు పూర్తయ్యాయని, రెండో దశ చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెరాసను విలీనం చేసే ప్రతిపాదనపై కూడా చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
అదే విషయాలను కెసిఆర్ కూడా తనను కలుస్తున్నవారికి చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన గడువులు చెప్పడమే పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. దసరా లోపు, దీపావళి లోపు అంటూ గడువులు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణ విషయంలో కోదండరామ్ ఉద్యమ బాటను చేపట్టగా, కెసిఆర్ చర్చల తొవ్వ తీశారు. చర్చల కోసం కెసిఆర్ ఈ నెల రెండో వారం తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు ఎంతు దూరం పోతాయో వేచి చూడాల్సిందే.