సోదాల్లో ఏం దొరకలేదు: జగన్ కేసులో సిబిఐ, మరిన్ని
ఈ మేరకు నాంపల్లి సిబిఐ కోర్టుకు సోమవారం సెర్చ్ రిపోర్టును సిబిఐ ఉన్నతాధికారులు రహస్యంగా అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కోర్టు అనుమతితో తాము జీడిమెట్లలోని కెఐజె ప్లాస్టిక్స్, గ్రీన్ ట్రేడ్ కంపెనీల్లో ఈ నెల 5న సోదాలు చేశామని, కానీ, అక్కడ తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక అందిస్తున్నామని సిబిఐ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.
వాస్తవానికి జగతిలోకి పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఆయా కంపెనీల్లో తనిఖీలు చేసేందుకు పెద్ద కసరత్తే చేసింది. 4న ఈడి జగతి, మరికొన్ని సంస్థల ఆస్తులను జప్తు చేసినప్పుడే, నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చిన ఉన్నతాధికారి ఒకరు నేరుగా అనుమతి పత్రాలను కోర్టుకు అందజేసి, ఆమోదింపజేసుకున్నారు.
ఆ విషయం రెండో రోజుకు కానీ బయట ప్రపంచానికి తెలియలేదు. సోమవారం సెర్చ్ రిపోర్టును తిరిగి కోర్టుకు ఇవ్వడం ద్వారా, అప్పుడు సిబిఐ తనిఖీలు చేసిందన్న విషయం నిర్ధారణ అయింది. అయితే సిబిఐ... మరిన్ని కంపెనీలపైనా సోదాలు చేసే అవ కాశం ఉన్నట్లు న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి.