మళ్లీ సకల జనుల సమ్మె: టిఎన్జీవోల హెచ్చరిక
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ మార్చ్ ప్రశాంతంగా జరిగిందని హర్షం వ్యక్తం చేస్తే, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం విధ్వంసం సృష్టించారని ఆనడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆఖరికి డిజిపి దినేష్ రెడ్డి సైతం కేసులు లేవని చెబుతుంటే, హోం మంత్రి మాత్రం కేసులు ఉన్నాయని చెబుతున్నారని వారు ఆరోపించారు.
టిఎన్జీవోలపై కేసులు పెట్టడం సరికాదని, తెలంగాణ కోసం కృషి చేస్తున్నవారిపై పెట్టిన కేసులను ఎత్తివేసే బాధ్యత తెలంగాణ మంత్రులపైనే ఉన్నదని తెలంగాణ ఎన్జీవో నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి అన్నారు. టి. మార్చ్ ప్రశాంతంగా జరిగిందని గుర్తు చేస్తూ విధ్వంసం జరిగితే చూస్తూ ఊరుకోమని హోంమంత్రి వ్యాఖ్యానించడాన్ని వారు ఖండించారు.
తెలంగాణ మార్చ్ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైనవారిలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా మొత్తం 39 కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు.
నమోదైన కేసుల వివరాలను ఆయన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా హింసకు పాల్పడినవారిని గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా కేసుల విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు.