ఆ లింకేమిటి, చంద్రబాబు బేరమెంత: వాసిరెడ్డి పద్మ
ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందకు బేరం కుదుర్చుకున్నారో చెప్పాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆమె సవాల్ చేశారు. అవిశ్వాసమంటే తెలుగుదేశం నాయకులకు అంత ఉలుకెందుకని అడిగారు. తెలుగుదేశం పార్టీ నాయకుల వీధి నాటకాలను త్వరలో బయటపెడతామని ఆమె అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు ప్రజా స్పందన లేదని ఆయన శుక్రవారం నెల్లూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఉచిత విద్యుత్తు ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అంతటి అవినీతిపరుడు మరొకరు లేరని అన్నారు. దుమ్మంటే చంద్రబాబు ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలను బయటపెట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మేకా శేషుబాబు, తెల్లం బాలరాజు అన్నారు. పాదయాత్ర సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటారని వారు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అన్నారు. రాష్ట్రంలో 2004కు ముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని వారన్నారు.