కిరణ్ రెడ్డి, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం
చంద్రబాబు కూడా వెనక్కి తగ్గడం లేదు. వస్తున్నా మీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాకుండా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై ఆయన మాటల తూటాలు విసురుతున్నారు. కాంగ్రెసును తల్లి కాంగ్రెసుగా, వైయస్సార్ కాంగ్రెసును పిల్ల కాంగ్రెసుగా ఆయన అభివర్ణిస్తున్నారు.
చాలా కాలంగా ఎక్కువగా మాట్లాడకుండా మౌనం పాటిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన ఇందిరమ్మ బాటలో శివాలెత్తారు. తన సహజశైలికి భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. ఐఎంజి భూముల వ్యవహారంపై సిఎం చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. చంద్రబాబు పాదయాత్రనే కాదు, చేతుల మీద నడిచినా ప్రజలు విశ్వసించబోరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో చివరి రోజు ఇందిరమ్మ బాటలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ పథకాలు ఎలా నీరుగారిపోయాయో లెక్కలతో సహా చెప్పడానికి ప్రయత్నించారు.
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు మాటల యుద్ధంతో రెండు పార్టీలలో కూడా వేడి పెరిగిపోయింది. కాంగ్రెస్ పక్షాన 20 సూత్రాల అమలు కమిటీ చెైర్మన్ తులసీరెడ్డి, శాసనమండలి విప్ వెై.శివరామిరెడ్డి, ఇంకా మరి కొందరు నేతలు చంద్రబాబు టార్గెట్గా మీడియా సమావేశాలలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కింజరాపు ఎరన్న్రాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు, శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, అధికార ప్రతినిధి రేవంత్రెడ్డి, శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ సహా పలువురు నేతలు ఇటు కిరణ్ కుమార్ రెడ్డిని, అటు జగన్ను లక్ష్యంగా చేసుకొని మాటల యుద్ధం పెంచారు.