విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్
వినియోగ చార్జీల నిమిత్తం 10.3 కోట్ల రూపాయల విలువ చేసే నాలుగు చెక్కులను కింగ్ఫిషర్ జిఎంఆర్కు ఇచ్చింది. అవి చెల్లలేదు. దాంతో జిఎంఆర్ కేసు నమోదు చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ మాల్యా హాజరు కాకపోవడంతో 13వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది.
తాను విదేశాల్లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని మాల్యా కోర్టును కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాల్యాతో పాటు సిఇవో సంజయ్ అగర్వాల్ కూడా ప్రతివాదులుగా ఉన్నారు. పార్కింగ్, ల్యాండింగ్, నావిగేషన్ చార్జీల కింద కింగ్ఫిషర్ జిఎంఆర్కు చెక్కులు ఇచ్చింది.
ఇంతకు ముందు 2012 జూన్లో జివికె గ్రూప్ నడుపుతున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే విధమైన చెక్కు బౌన్స్ కేసును ముంబై క్రిమినల్ కోర్టులో కింగ్ఫిషర్పై వేసింది. ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ మూడు కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసును కింగ్ఫిషర్పై ఇదివరకు వేసింది.
కింగ్ఫిషర్ 2012 జూన్ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో 651 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది.