మైనారిటీ కార్పోరేషన్ స్కామ్లో ఇంటి దొంగలు
దర్యాప్తు నిగ్గు తేల్చిన విషయాలను పరిగణనలోకి తీసుకుని కార్పోరేషన్ ఎండి ఇలియాస్ రిజ్వీపై ప్రభుత్వం శుక్రవారం బదిలీ వేటు వేసింది. మాతృ శాఖ అటవీ శాఖకు ఆయనను పంపించింది. బదిలీ అయిన తర్వాత వెళ్లిపోతూ తనతో పాటు కొన్ని కీలకమైన ఫైళ్లను తీసుకుని వెళ్లడానికి రిజ్వి ప్రయత్నించారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిశోర్ గుర్తించి రిజ్వీని పట్టుకున్నారు. కుంభకోణంలో ఇంటి దొంగల పాత్ర ఉందని సిఐడి అధికారులు గుర్తించిన నేపథ్యంలో రిజ్వీ కొన్ని ఫైళ్లను తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించడం వివాదంగా మారింది.
కుంభకోణం కేసులో సిఇడై అధికారులు నిందితులు చుండూరి వెంకటకోటి సాయికుమార్, నండూరి వెంకట రమణ, నవీన్ సాగర్, బండాడ కేశవరావులను సిఐడి అధికారులు అరెస్టు చేసి కుంభకోణం గుట్టు విప్పారు. కేవలం కవరింగ్ లేఖలు, కొన్ని ఫోర్జరీ చెక్కుల ద్వారా కోట్ల రూపాయల నిధులను వారు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కార్పోరేషన్ నుచి 68 కోట్ల రూపాయలు ఎఫ్డిలు చేయించగా, అందులో 68 లక్షల రూపాయలు ఓ ఉన్నతాధికారికి ముడుపులుగా చెల్లించినట్లు అనుమానిస్తున్నారు. నలుగురిని తమ కస్టడీకి తీసుకుని సిఐడి అధికారులు ప్రశ్నించాలని భావిస్తున్నారు. దీనికి సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నారు. బ్యాంకులకు మధ్యవర్తిగా వ్యవహరించే కేశవరావు వివిధ శాఖల నుంచి 400 కోట్ల రూపాయలు ఎఫ్డిలు చేయించినట్లు వెల్లడైంది.
తప్పుడు పత్రాలతో మైనారిటీ కార్పోరేషన్ పేరుతో కరెంట్ ఖాతాను తెరవడంతో పాటు పెద్ద యెత్తున నిధులను బదిలీ చేసిన విజయా బ్యాంకు వ్యవహారంపై కార్పోరేషన్ అధికారులు రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి బ్యాంకుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కుంభకోణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని సిఐడి అదనపు డిజి రమణమూర్తి చెప్పారు. ఆయన మీడియా ప్రతినిధులతో ఆ విషయం చెప్పారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధుల కుంభకోణం అంశంపై విచారణ కొనసాగుతోందని దానకిశోర్ చెప్పారు. ఈ వ్యవహారం బయటపడిన 48 గంట్లలోనే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.