జైబోలో తెలంగాణకు ఉత్తమ విద్వేష అవార్డ్: జయప్రకాశ్
జైబోలో తెలంగాణకు ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ప్రకటించడం చాలా దురదృష్టకరమన్నారు. ఇక ట్యాంకుబండు పైన విగ్రహాలను కూల్చడం, మిలియన్ మార్చ్, తెలంగాణ కవాతులను కూడా జాతీయ సమైక్యతగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన విమర్శించారు. ఈ సినిమాలో సంభాషణలు, పాటలు.. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని జయప్రకాశ్ చెప్పారు.
తోటి భారతీయులను కించపర్చేలా, సీమాంధ్రులను భూదోపిడీదారులుగా చూపారని ఆయన చెప్పారు. ఇలాంటి జైబోలో తెలంగాణకు అవార్డు రావడం వెనుక ఏవో శక్తులు ఉన్నాయని ఆయన అన్నారు. అవార్డుల ప్రకటన వెనుక రాజకీయ నాయకులు, సంబంధిత మంత్రి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఇలాంటి చిత్రానికి జాతీయ సమైక్యతా చిత్రం అవార్డును ఇవ్వడం సరికాదని, దీనిని ప్రభుత్వం ఆమోదించవద్దని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దీనిని తిరస్కరించని పక్షంలో తాను కోర్టులకు వెళతానని జయప్రకాశ్ చెప్పారు.