రాజీనామా చేసేది లేదు: ఖుర్షీద్, విలేకర్లపై మండిపాటు
న్యూఢిల్లీ/ముంబయి: తనపై వచ్చిన ఆరోపణలతో తాను రాజీనామా చేసేది లేదని, అయితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆదివారం అన్నారు. రోడ్డున పోయే వారి ప్రశ్నలకు జవాబు చెప్పనని తెలిపారు. తాను, తన భార్య పేరిట ఉత్తర ప్రదేశ్లో నిర్వహిస్తున్న ట్రస్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను మీడియా ముందు ఉంచారు.
తమపై వచ్చిన ఆరోపణలపై ఏ సంస్థతో, ఏ విచారణకైనా సిద్ధమని, కాగ్ చేసినా అభ్యంతరం లేదని, దీనికంతటికీ కారణం ఎవరనేది విచారణలో తేలుతుందని ఆయన చెప్పారు. అయితే ఇండియా టుడే గ్రూపు పాత్ర కూడా విచారణ పరిధిలో ఉండాలని ఆయన తెలిపారు. తాను రాజీనామా చేయనని, అయితే ప్రభుత్వంలో తాను కొనసాగే అంశాన్ని పార్టీ ప్రభుత్వం నిర్ణయిస్తాయని చెప్పారు. పేరు చెప్పకుండానే అరవింద్ కేజ్రీవాల్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలేకరులపై కూడా ఖుర్షీద్ నోరు పారేసుకున్నారు. పలుమార్లు సంయమనం కోల్పోయిన ఖుర్షీద్ టివి టుడే గ్రూపు జర్నలిస్టును నోర్ముసుకొని, బయటకు వెళ్లమని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశానికి ముందు కూడా పలువురు పాత్రికేయులను బయటకు వెళ్లాలన్నారు. అయితే మిగతా వారు నిరసన వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. తనతో పాటు ఇండియా టుడే గ్రూపు పైనా విచారణ జరగాలన్నారు.
కాగా ట్రస్టు కార్యకలాపాలపై మరో విచారణకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిద్ధమయ్యారు. మరోసారి విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. అయితే ఈ విచారణతో ఖుర్షీద్ను బయటపడేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విచారణకు సిద్ధమా అని అరవింద్ కేజ్రీవాల్ మంత్రికి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలలో ఖుర్షీద్ పైన వికలాంగ అభ్యర్థిని బరిలో నిలుపుతామని చెప్పారు.