బిపి ఆచార్యకు షరతులతో కూడిన బెయిల్
ఎమ్మార్ కేసులో నిందితుడైన బిపి ఆచార్య ఈ సంవత్సరం జనవరి 30వ తేదిన అరెస్టయ్యారు. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ బిపి ఆచార్యకు చుక్కెదురయింది. దీంతో అప్పటి నుండి అతను జైలులోనే ఉన్నారు. రెండుమూడు సార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ సిబిఐ కేసు దర్యాఫ్తులో ఉందని చెబుతూ బెయిల్కు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో కోర్టులో పలుమార్లు అతనికి చుక్కెదురయింది.
ఎమ్మార్ కేసులో ఇతను భారీ అవకతవకలకు పాల్పడ్డారనేది సిబిఐ ఆరోపణ. అక్రమాలు తెలిసి కూడా సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయలేదని, ఎమ్మార్కు లబ్ధి చేకూర్చేందుకు ఎపిఐఐసి వాటాలు తగ్గడంలో ఆచార్యనే ప్రధాన కుట్రదారు అని సిబిఐ ఆరోపణ. ఈ రోజు కూడా బిపి ఆచార్య బెయిల్ పిటిషన్ను సిబిఐ తిరస్కరించింది. అయితే ఆచార్య తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి అతనికి బెయిల్ మంజూరు చేసింది.