టిఆర్ఎస్ను వెనుకేసుకొస్తావా: కెకెపై జగ్గారెడ్డి నిప్పులు
పదవులు ఉన్నప్పుడు కెకెకు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల్లో ఉన్నప్పుడు వాటిని వదులుకొని తెలంగాణ నినాదం ఎందుకు ఎత్తుకోలేదన్నారు. కాంగ్రెసులో ఉంటూ ఇతర పార్టీలను భుజానికెత్తుకునే బదులు స్వచ్చంధంగా పార్టీని విడిచి వెళ్లాలని సూచించారు. లేదంటే పార్టీ నుండి అతనిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ పది సీట్లకే పరిమితమైనదని, ఆ పార్టీపై తెలంగాణ ప్రజలకు నమ్మకముంటే కేవలం ఆ స్థానాలలో మాత్రమే ఎందుకు గెలిచారో చెప్పాలన్నారు. తెరాసతో తెలంగాణ రాదన్నారు. కాంగ్రెసు పార్టీయే ఇస్తుందన్నారు. తెరాస బలంగా లేదని, సెంటిమెంట్ ఉపయోగించుకొని వారు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తెరాసను వెనుకేసుకొస్తున్నందుకు కెకె సిగ్గుపడాలన్నారు.
కాగా అంతకుముందు జై తెలంగాణ అని ఎవరు అన్నా తెలంగాణ రాష్ట్ర సమితికే ఓటు పడుతుందని కె కేశవరావు అన్నారు. ఆయన తెలంగాణ నగారా సమితి ఆధ్యర్వంలో ఇందిరా పార్కు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి వ్యక్తి మనసులో తెలంగాణ ఉందన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అందరి ఆశయం తెలంగాణే అన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసే వరకు కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సభకు వెళ్లవద్దని సూచించారు. తెలంగాణ కోసం అందరం కలిసి ఐక్యంగా పోరాడుదామన్నారు.