కెకెకు తెలంగాణ సెగ: అందుకే హెలికాప్టర్లో ప్రధాని
అయన వస్తున్న సమయంలో తెలంగాణవాదులు ఒక్కసారిగా తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కెకె ఒకింత అసహనానికి గురయ్యారు. తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని బెదిరించినంత పని చేశారు. అంతలో నాగం జనార్ధన్ రెడ్డి కలుగజేసుకొని కెకెను వేదిక పైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడారు.
నక్సల్స్ సమస్య ఒక తెలంగాణ సమస్య కాదని, అది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే నక్సల్స్ విజృంభిస్తారని కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై నాగం మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని హెచ్చరించారు. తెలంగాణపై ఆ పండుగ పండుగ తర్వాత అంటూ కేంద్రం మభ్యపెడుతోందని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం ప్రధానికి అర్థమైంది.. కోదండరామ్
తెలంగాణ ఉద్యమం తీవ్రత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు అర్థమైందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం చెప్పారు. తెలంగాణ ఉద్యమం కారణంగానే ప్రధాని హెలికాప్టర్లో జీవ వైవిధ్య సదస్సుకు హాజరవుతున్నారని అన్నారు. కాంగ్రెసు పార్టీ నేల విడిచి సాము చేస్తోందన్నారు. నవంబర్ 1వ తేదిని తాము తెలంగాణ విద్రోహ దినంగా నిర్వహిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాల హస్తాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అందుకే తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతుందన్నారు. మూడు రోజుల్లో తెలంగాణ జెఏసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రధానే తెలంగాణ తీవ్రత కారణంగా హెలికాప్టర్లో వెళితే పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి మొత్తం అర్థమవుతుందన్నారు. కేంద్రం తెలంగాణపై ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.