టివి నటి హేమశ్రీ మృతి: రాజకీయ ఒత్తిళ్లు లేవన్న ఐజి
కాగా తీవ్ర సంచలనం సృష్టించిన కన్నడ నటి హేమశ్రీ మృతి ఘటనలో రాష్ట్ర మంత్రి పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వినవచ్చిన విషయం తెలిసింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య రాష్ట్ర మంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. హేమశ్రీ మృతికి బాధ్యుడైన మన రాష్ట్ర మంత్రి ఎవరో బయటపెట్టాలని ఆయన మంగళవారం విజయవాడలో డిమాండ్ చేశారు. హేమశ్రీ భర్త సురేంద్ర బాబు, ఇద్దరు కాంగ్రెసు మాజీ కార్పొరేటర్లు హేమశ్రీని మంత్రిగా ఎరగా వేయాలని చూడడం దారుణమని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హేమశ్రీ మృతి కేసును దర్యాప్తు చేయకుండా ఆదేశాలు జారీ చేసినవారెవరని ఆయన అడిగారు. రాష్ట్ర హోం మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి ఇంకా కొనసాగడంలో అర్థం లేదని ఆయన అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. హేమశ్రీ మృతికి బాధ్యుడైన మంత్రికి మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని వర్ల రామయ్య అన్నారు. ఇదిలావుంటే, హేమశ్రీ భర్త సురేంద్ర బాబుకు సహాయం చేసిన కారు డ్రైవర్ సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సతీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తెలుస్తోంది. హత్యా నేరంపై పోలీసుల అదుపులో ఉన్న హేమశ్రీ భర్త విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. సురేంద్రబాబు సహకరించని నేపథ్యంలో కారు డ్రైవర్ సతీష్ పట్టుబడితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హేమశ్రీ హత్యకు సంబంధించిన విచారణను పోలీసులు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కోర్టులో దాఖలు చేయడానికి చార్జిషీట్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో అక్టోబర్ 9వ తేదీ రాత్రి మృతి చెందింది.