కన్నడ టివి నటి హేమశ్రీ కేసు: కారు డ్రైవర్ అరెస్ట్
బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో అతడిని ఆంధ్ర సరిహద్దుల్లోని బాగేపల్లె వద్ద ఒక హోటల్లో హెబ్బాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా హేమశ్రీ పైన ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసులు బుధవారం తెలిపిన విషయం తెలిసిందే. మోతాదుకు మించి క్లోరోఫాం ప్రయోగించడం వల్లనే ఆమె మృతి చెందినట్లుగా కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జి చెప్పారు. తన భర్త సురేంద్ర కుమార్తో హేమశ్రీ ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారని చెప్పారు. హైదరాబాదు నుండి బెంగళూరుకు వస్తున్న సమయంలో అనంతపురం సరిహద్దుల్లో హేమశ్రీ మృతి చెందిందన్నారు.
కాగా నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తీవ్ర అస్వస్థతగా ఉందంటూ ఆమె తన భర్త ముప్పయ్యేడేళ్ల సుధీంద్ర, ఆమెను కారులో బెంగళూరు నగర శివారులోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
హేమశ్రీ మృతికి సంబంధించి ఆమె మిత్రుడు మంజునాథ్ను కూడా పోలీసులు ప్రశ్నించారు. హేమశ్రీ హత్యకు ముందు అతను ఆమెతో మాట్లాడిన సిడీని విడుదల చేశాడు. తన భర్త సురేంద్ర నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని హేమశ్రీ చెబుతున్నట్లు ఉన్న సీడిని అతను మీడియాకు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్ను పోలీసులు విచారించి, పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు అతనికి చెప్పారు.