పవన్ 'రాంబాబు'కు లగడపాటి బాసట: కెసిఆర్పై ఫైర్
సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. తెరాస విద్యార్థి విభాగం కార్యకర్తలు ఆ దాడి చేశారని ఆరోపించారు. సినిమాలో చక్కని సందేశం ఉందని, విద్వేషం మన సంస్కృతి కాదని సినిమా సందేశాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. ఏ తల్లి అయినా సరే గౌరవించాలని చెప్పారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బిహారీల మీద, ఉత్తరప్రదేశ్ వారి మీద దాడులు జరిగాయని, ఈ స్థితిలో మనమంతా భరతమాత ముద్దుబిడ్డలమనే సందేశాన్ని సినిమాలో పూరీ అందించారని ఆయన అభిప్రాయపడ్డారు.
మన రాష్ట్రంలో తెరాస నాయకులు విద్వేషాన్ని రగిలిస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని, అమయాకులను రాజకీయ నాయకులు పొట్టన పెట్టుకుంటున్నారని, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. చిత్రంలో ఏ ప్రాంతం గురించీ కూడా చెప్పలేదని, గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్లు తెరాస నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. భారతీయత గురించి, వివిధ రాష్ట్రాల గురించి సినిమాలో చెప్పారని ఆయన అన్నారు.
పూరీ జగన్నాథ్ ఇంటిపై దాడి చేసినవారంతా పోలీసు స్టేషనులో ఉండాలని, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అరెస్టు చేసి, వదిలేస్తున్నారని, వారిని వదిలేయకూడదని లగడపాటి అన్నారు. దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోకపోతే భరతమాతకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. గుండె మీద చేయి వేసుకుని తాను భరతమాత బిడ్డను అనుకుంటే కెసిఆర్ దాడులను ఖండించాలని ఆయన సూచిచా్రు. లేదంటే తాము సహించబోమని, ప్రజలు కెసిఆర్ రాజకీయాలను భూస్థాపితం చేస్తారని ఆయన అన్నారు. సినిమాలో తెలంగాణ గురించి లేదని, ప్రాంతీయ విద్వేషాల గురించి ఉందని లగడపాటి అన్నారు.