షర్మిల ఎఫెక్ట్: జగన్ పార్టీ వైపు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసు కార్యకర్తలు, వైయస్ అభిమానులు ఏ నిర్ణయం తీసుకోమని చెబితే తాను ఆ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మొదటి నుంచి వైయస్ను అభిమానించే చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ ఇవాళ కాకపోతే రేపైనా కాంగ్రెస్ను వీడి వైయస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా ఈ దిశగానే పావులు కదుపుతున్నారట. జగన్ పార్టీలో చేరేందుకు సరైన సమనయం కోసం వేచి చూస్తున్నారట.
సమయం చిక్కినప్పుడల్లా తానొక్కడే కాకుండా తనతో పాటు పది మంది ముఖ్యులను వెంటబెట్టుకుని మరీ పార్టీ గోడ దూకేసేందుకు దాదాపు సంసిద్ధంగానే ఉన్నట్లు చింతలపూడి కాంగ్రెస్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే రాజేష్ రెండు రోజుల క్రితం కూడా చింతలపూడిలో తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారితోను, ముఖ్యులతోనూ, సీనియర్ కార్యకర్తలతోనూ రహస్యంగా భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి.
ఒక తోటలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ భేటీకి హాజరైన వారితో ఎమ్మెల్యే సుదీర్ఘ మంతనాలు జరిపారట. ఇవి మంతనాలు అనుకునేదానికంటే అభిప్రాయ సేకరణ అనుకుంటే బాగుంటుందంటున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తన మనసులోని మాటను దాదాపు బయటపెట్టారట. పార్టీని వీడేందుకు తాను దాదాపు సిద్ధంగానే ఉన్నానన్నట్లుగా సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు.