పవన్ మూవీపై ఆగని రగడ: ప్రభుత్వానికి కమిటీ నివేదిక
సినిమాను ముగ్గురు సభ్యులు మాత్రమే చూశారని, మిగిలిన నలుగురు చూడాలని సభ్యుల్లో ఒకరైన అల్లాణి శ్రీధర్ అన్నారు. సినిమాలో కొందరి మనోభావాలను దెబ్బ తీసేలా అభ్యంతరకరమైన సంభాషణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచిస్తామని ఆయన అన్నారు. కొందరి మనోభావాలను దెబ్బ తీసేలా కొన్ని సన్నివేశాలున్నాయని, వాటిని తొలగింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు.
మిగతా సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చంద్రవదన్ చెప్పారు. దర్శకుడికి, నిర్మాతకు - ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉంటుందని అల్లాణి శ్రీధర్ అన్నారు. కాగా, కమిటీని బహిష్కరిస్తున్నట్లు దర్శకుడు ఎన్ శంకర్, నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ చెప్పారు. ఆ సినిమాను తాను చూడదలుచుకోలేదని, కమిటీ సమావేశంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని అల్లం నారాయణ చెప్పారు.
కాగా, ఎన్ శంకర్ తాజా ఆరోపణలతో కొత్త వివాదానికి తెర తీశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా, తెలంగాణలో సినిమాకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు కౌంటర్గా ఆంధ్ర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనలకు దిగారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు రాస్తారోకోలు నిర్వహించారు. సినిమాను అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
సినిమా రాజకీయ రంగు కూడా పులుముకుంది. సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు సినిమాను బలపరుస్తుండగా, తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. సినిమా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందంటూ తొలి రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు తగులపెట్టారు. తెలంగాణవాదులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన తర్వాత వారు మాట్లాడడం లేదు. మొత్తం మీద, సినిమా పెద్ద దుమారాన్నే రేపింది.