ఎన్టీఆర్తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి లేరు
సిపిఐ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన కూడా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో విఠల్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ 'బావ'గా అభివర్ణించేవారు. ఆ తర్వాత, టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా విఠల్ రెడ్డికి మంచి అనుబంధమే ఉండేది. ఆ పరిచయాలతోనే నర్సాపూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
విఠల్ రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి. 6వ తరగతి వరకు చదువుకున్న విఠల్ రెడ్డి వేల ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించినా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. 1954లో సీపీఐలో చేరి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1957లో మొదటిసారి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1956-62 వరకు కౌడిపల్లి సర్పంచ్గా కొనసాగారు.
1962లో మొదటిసారి సీపీఐ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1978లో కూడా విజయం సాధించారు. అనంతరం 1985, 89, 94ల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించి నర్సాపూర్ను కమ్యూనిస్టు కంచుకోటగా నిలిపి రాష్ట్ర స్థాయిలోనే పేరు తీసుకువచ్చారు. 1999లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన సునీతారెడ్డి చేతిలో చివరిసారి ఓటమి చెంది ఆ తర్వాత వయోభారం, అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
విఠల్రెడ్డికి భార్య వీరమణి, నల్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో భార్య, ఇద్దరు కొడుకులు చనిపోయారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ కుమారుడు కిషన్ రెడ్డి ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. విఠల్ రెడ్డి అంత్యక్రియలను శనివారం ఆయన స్వగ్రామం కౌడిపల్లిలో నిర్వహించనున్నారు. ఆయన మృతికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరని లోటని, ఎప్పుడూ ప్రజల కోసం పరితపించే వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు.