జగన్పై ఎందుకు మాట్లాడరు: కేజ్రీవాల్కు విహెచ్ లేఖ
దివంగత ముఖ్యమంత్రి కుమారుడు జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడని, వేల భూములను తీసుకున్నాడని, ఖనిజ సంపదను తీసేసుకున్నాడని, అయినా జగన్ గురించి కేజ్రీవాల్ ఒక్క రోజు కూడా మాట్లాడలేదని ఆయన మీడియాతో అన్నారు. కేజ్రీవాల్ కేవలం రాజకీయ నాయకులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని, బ్యూరోక్రసీని వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. బ్యూరోక్రసీ పథకాలను, నోట్స్ను తయారు చేస్తుందని, అక్కడ జరిగే అవినీతి గురించి మాట్లాడాలని, ఒక వైపు మాత్రమే చూడడం సరి కాదని అన్నారు.
రాజకీయ నాయకులపై ప్రజలు ఐదేళ్లకోసారి తీర్పు ఇస్తారని, అధికారులపై తీర్పు ఎవరు ఇవ్వాలని అన్నారు. సమాచార హక్కు అస్త్రాన్ని తమ కాంగ్రెసు ప్రభుత్వమే ప్రజలకు అందించిందని, దాని ద్వారానే అవినీతిని ప్రశ్నించవచ్చునని ప్రజలకు తెలిసి వచ్చిందని, దాన్నే కేజ్రీవాల్ వాడుకుంటున్నారని, అటువంటప్పుడు అవినీతి విషయంలో అన్ని వైపులా చూడాలని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలతో జగన్ జైలు పాలయ్యారని, నీతిపరుడిగా చెప్పుకుంటూ తిరిగారని, జగన్ 43 కోట్ల రూపాయలు మింగేశాడని సిబిఐ చార్జీషిట్లు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. అటువంటి జగన్పై కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని అన్నారు.
వైయస్ జగన్తో సంబందం ఉందా, లేదా అనేది కేజ్రీవాల్ చెప్పాలన్నమారు. తానొక్కడే నీతిమంతుడినని కేజ్రీవాల్ చెప్పుకుంటున్నారని, అటువంటప్పుడు ఒకే వైపు చూడడం సరి కాదని, అన్ని వైపులా చూడాలని ఆయన అన్నారు. పెద్ద రాజకీయ నాయకుల మీదనే మాట్లాడుతున్నారని, బ్యూరోక్రసీని వదిలేస్తున్నారని విహెచ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలపై అధికారులు కూడా జైలు పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఏది చేయమంటే అధికారులు అది చేస్తారా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అది సరి కాదని చెప్పాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చేయాలని చెప్పింది చేయకపోతే బదిలీ చేస్తారు, అంతకు మించి ఏమీ చేయలేరని అన్నారు.
ముఖ్యమంత్రి ఏది చేయాలని చెప్తే అది చేద్దాం, మనకు కూడా లాభం జరుగుతుందని వ్యవహరిస్తే అలాగే ఉంటుందని ఆయన అన్నారు. కేజ్రీవాల్ తన లేఖకు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్లీ తాను మాట్లాడుతానని ఆయన అన్నారు. జగన్పై కేజ్రీవాల్ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందని విహెచ్ అన్నారు.