'.. రాంబాబు' తగ్గినా: ఇరు ప్రాంతాల్లో పోటాపోటీ
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై రాష్ట్రంలో మాటల దాడి, ప్రతిదాడి వేడి ఇంకా తగ్గలేదు. ఆదివారం పలువురు నేతలు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తదితరులు ...రాంబాబు సినిమాపై స్పందించారు.
తెలంగాణవాదుల దాడిని రాఘవులు, నారాయణ ఖండించారు. ఏవైనా అభ్యంతరాలుంటే సెన్సార్ బోర్డును సంప్రదిస్తే బాగుండేదని సూచించారు. సినిమాను సినిమాలాగే చూడాలన్నారు. అయితే సినిమా వివాదం విషయంలో ఇరువర్గాలు ఓవర్ యాక్షన్నే ప్రదర్శించాయని నారాయణ అభిప్రాయపడ్డారు. చిత్రంలో తమకు వ్యతిరేకంగా ఉందని ఎవరైనా అనుకుంటే చూడటం మానేయాలని, అలాగే చూడవద్దని చెప్పాలి. కానీ ఇలా దాడులు మాత్రం హర్షించదగ్గ విషయం కాదని రాఘవులు అన్నారు.
అయితే నారాయణ వ్యాఖ్యలకు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు కౌంటర్ ఇచ్చారు. సినిమాను సినిమాలాగే చూడాలని కొందరు చెబుతున్నారని, అయితే సినిమాను కూడా సినిమాలాగే తీయాలన్నారు. పలు సినిమాలల్లో తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కించపరిచే విధంగా ఉంటుందని, దానిపై ఎవరూ ఎందుకు పెదవి మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై సినిమాల ప్రభావం ఎంతో ఉంటుందని అలాంటి సినిమాల్లో తమ ప్రాంతాన్ని అవమానించేలా ఉంటుందన్నారు.
సినిమా ఇండస్ట్రీలో మాఫియా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఎలా కించపర్చేలా తీశారని ప్రశ్నించారు. తెలంగాణ నుండి ఎవరూ ఇండస్ట్రీలో ప్రధానంగా ఎదగలేదని, ఫ్లెక్సీలు దగ్ధం చేస్తే మాట్లాడుతున్న వారు విద్యార్థులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. విద్యార్థులలో వారి అభిమానులు ఉన్నప్పటికీ స్పందించక పోవడం దారుణం కాదా అన్నారు.
మరోవైపు కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై తెలంగాణవాదుల వైఖరిని నిరసిస్తూ సీమాంధ్రలో పలుచోట్ల చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మంచి సినిమాను, మెసేజ్ ఉన్న సినిమాను ఉద్దేశ్య పూర్వకంగా వివాదాల్లోకి లాగే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా ఈ సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు తొలగించేందుకు దర్శకుడు, నిర్మాత సిద్ధపడినా, ప్రభుత్వం ఏడు సీన్లను కట్ చేయమని చెప్పినప్పటికీ ఇంకా వేడి మాత్రం తగ్గక పోవడం గమనార్హం.