అందుకు బాధపడట్లేదు, నాకూ సొంతగా...: నిత్యానంద
తాను యువ పీఠాధిపతి పోస్టు కావాలని అప్పట్లో అడగలేదని, ఇది అరుణగిరినాథ దేశికర్దేనని చెప్పారు. తన వల్ల సమస్యలు వస్తే తొలగిపోవడానికి తాను సిద్ధమేనన్నారు. యువ పీఠాధిపతిగా నిత్యానంద నియామకంపై నిరసనలు వెల్లువెత్తడం, తన పదవికే ఎసరు రావడంతో మదురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరినాథ్ నిత్యానందను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఇటీవలనే ప్రకటించారు. దీనిపై నిత్యానంద మాట్లాడారు.
తన వల్ల, తన శిష్యగణం వల్ల ప్రాణహానీ వుందని అరుణగిరినాథ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. తమ వల్ల ఆయనకు ఎలాంటి హాని వుండదని స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో అరుణగిరినాథను కలసి అధికార పూర్వకంగా రాజీనామా చేయాలని తాను నిర్ణయించుకున్నానని, ఈ విషయం ఆయనకూ చెప్పానని, అయితే ఇంతలోనే తనని తప్పిస్తున్నట్లు ప్రకటించడం మాత్రం తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.
తనకు కూడా బ్రహ్మాండమైన ఆశ్రమం ఉందని, ఆ ఆశ్రమానికి తానే పీఠాధిపతినన్న విషయాన్ని మరువరాదని పేర్కొన్నారు. మరోవైపుఆధీనం నుంచి తన శిష్యులను పోలీసులు బలవంతంగా గెంటేశారన్న వార్తల్లో నిజం లేదని, తనను పదవి నుంచి తొలగించడంతో తన శిష్యులే స్వచ్ఛందంగా అక్కడ నుంచి బయటికి వచ్చేశారని నిత్యానంద తెలిపారు. నిత్యానంద తొలగింపుతో తమిళనాడువ్యాప్తంగా పలు హిందూ సంస్థలు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.