కోదండరామ్ అరెస్ట్: బాబుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్
జెఏసి నేతల అరెస్టును పలువురు తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కోదండరామ్ నిప్పులు చెరిగారు. తమను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని తాము భావిస్తే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణపై టిడిపి వైఖరి చెప్పమని ప్రశ్నిస్తే తప్పేమిటన్నారు. తాము బాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పలేదని, నిరసన మాత్రమే తెలియజేస్తామని చెప్పామన్నారు.
అంతకుముందు హైడ్రామా
అంతకుముందు కాసేపు హైడ్రామా కొనసాగింది. జెఏసి నేతలు చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టే రాజోలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు శాంతినగర్లో అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని, తమను అనుమతించాలని వారు పోలీసులను కోరారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడే నిరసన తెలియజేయాలని, రాజోలికి అనుతించేది లేదని చెప్పారు.
అందుకు పోలీసులు పదిమందిని అక్కడకు తీసుకు వెళ్తామని చెప్పారు. జెఏసి నేతలు అందుకు నిరాకరించారు. అందరం వెళ్తామన్నారు. పోలీసులకు, జెఏసి నేతలకు కాసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతుగా, కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అక్కడకు వచ్చారు. కోదండరామ్ గో బ్యాక్ అంటూ నినదించారు. పోలీసులు జెఏసితో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు కోదండరాం సహా జెఏసి నేతలను అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా జెఏసి నేతల అరెస్టుని నాగం జనార్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు పలువురు తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జెఏసి నేతల అరెస్టుకు టిటిడిపి నేతలే బాధ్యత వహించాలని దేవీ ప్రసాద్ అన్నారు.