డిసెంబర్ 9 ప్రకటన: తెలంగాణకోసం ఎబివిపి పాదయాత్ర
కేంద్రం తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండి వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి విద్యార్థి మహా పాదయాత్ర పేరుతో నవంబర్ 26 నుండి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసి వెనక్కి వెళ్లిందని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల నుండి సుమారు 500 మంది విద్యార్థులతో ఈ మహాపాదయాత్ర చేపడుతున్నామన్నారు. నవంబరు 26న తెలంగాణలోని ఐదు ప్రాంతాల నుండి ఒకేసారి ఈ పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలను కలుపుకుని సుమారు పదిహేను వందల కిలో మీటర్ల వరకు ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ పాదయాత్ర డిసెంబరు 7న హైదరాబాద్కు చేరుకుంటుందని చెప్పారు.
అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. 12 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో ఎబివిపి జాతీయ కార్యదర్శి కడియం రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పాండు రంగా రెడ్డిలు తెలిపారు.