బెర్తులు ఖరారు: సీమాంధ్రకు రెండు, తెలంగాణకు ఒకటి
కావూరి సాంబశివ రావు, రేణుకా చౌదరి, వి హనుమంత రావు, సర్వే సత్యనారాయణ తదితరుల పేర్లు జోరుగా వినిపించాయి. అయితే పార్టీ అధిష్టానం సామాజిక వర్గం, తెలంగాణ సెంటిమెంట్, ఆయా ప్రాంతాలలో ప్రభావితం చేసే నేతలను ఎన్నుకొని వీరికి బెర్తులు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలోనే చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామనే హామీ ఉంది. అందుకే ఆయన తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికయ్యారు.
కర్నూలుతో పాటు సీమ జిల్లాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అవకాశం దక్కింది. కోట్ల పేరు నిన్ననే ఖరారైనప్పటికీ తెలంగాణకు చెందిన రేణుకా చౌదరికి ఇవ్వాలా లేక కోట్లకు ఇవ్వాలా అనే అంశంపై పార్టీ అధిష్టానం సందిగ్ధకు లోనైంది. అయితే చివరకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డినే ఎంపిక చేసింది.
తెలంగాణ ప్రాంతంలో ఎస్టీల ప్రాబల్యం ఎక్కువ. ఆ వర్గాన్ని అతను ప్రభావితం చేస్తారనే భావనతో బలరాం నాయక్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఊపినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం సీమ నుండి కోట్లకు, ఆంధ్రా నుండి చిరుకు, తెలంగాణ నుండి బలరాంకు అవకాశం ఇచ్చింది. మూడు ప్రాంతాల నుండి ముగ్గురికి అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు నీరుగారిపోయాయి. కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరికి మంత్రిగా ప్రమోషన్ రానుంది.