నటి హేమశ్రీ మృతి: సురేంద్ర బాబు కారు డ్రైవర్ అరెస్టు
హేమశ్రీ మృతి గురించి సతీష్ నుంచి కీలకమైన సమాచారం అందవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. హేమశ్రీని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులకు సతీష్ నుంచి సమాచారం రాబట్టాలని చూస్తున్నారు. హేమశ్రీ భర్త సురేంద్ర బాబు వద్ద రెండేళ్లుగా సతీష్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం వదిలేసినప్పటికీ మళ్లీ ఇటీవల సురేంద్రబాబు వద్ద తిరిగి కారు డ్రైవర్గా చేరాడు. అతను ఉద్యోగం వదిలేయడానికి గల కారణమేమిటనేది తెలియదు. ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, ఎందుకు కనిపించకుండా పోయాడు, ఈ కేసులో అతని పాత్ర ఏమిటి వంటి ప్రశ్నలకు సతీష్ నుంచి పోలీసులు సమాధానాలు రాబట్టే అవకాశాలున్నాయి.
హేమశ్రీ మృతి కేసులో సురేంద్ర బాబును పోలీసులు అక్టోబర్ 10వ తేదీన అరెస్టు చేశారు. అతన్ని నవంబర్ 3వ తేదీ వరకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ వి పాటిల్ రిమాండ్ విధించారు. హేమశ్రీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేంద్ర బాబును అరెస్టు చేశారు. హేమశ్రీ నోరు, ముక్కు, నుదుటిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.