అసంతృప్తి: కావూరి రాజీనామా, రాయపాటి గుర్రు?
కావూరి సాంబశివరావు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం లేదు. ఆయన తన గదిలో కూర్చుని ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోకసభ స్థానం నుంచి రెండు సార్లు, మచిలీపట్నం నుంచి మూడు కావూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా రాజీనామా యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది సేపట్లో కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతారని అంటున్నారు.
తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఆయన చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. గతంలో దగ్గుబాటి పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కి తనకు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి మొదటి నుంచి విధేయంగా ఉన్న సీనియర్లకు ప్రాధాన్యం లభించడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన భావిస్తున్నారు.
ఎస్ జైపాల్ రెడ్డి, పురంధేశ్వరిలతో పాటు ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకోనున్న చిరంజీవి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేణుకా చౌదరికి పార్టీలో ప్రాధాన్యం లభిస్తోందని ఆయన బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని భావించిన తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
రాయపాటికి, కావూరికి నచ్చజెప్పేందుకు పార్టీ అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోంది. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కావూరి సాంబశివ రావుకు ఫోన్ చేసి, ఏ విధమైన తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని, తగిన ప్రాధాన్యం లభిస్తుందని చెప్పినట్లు సమాచారం. పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
వెంటనే ఢిల్లీ రావాలని రాయపాటి సాంబశివరావుకు సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రాయపాటి సాంబశివరావు టిటిడి చైర్మన్ పదవిని ఆశించారు. తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆయన చాలా కాలంగా అన్నారు. కాగా, తనకు పార్టీ పదవి అవసరం లేదని, మంత్రి పదవి మాత్రమే కావాలని కావూరి అంటున్నట్లు తెలుస్తోంది. తాను పార్టీలో కొనసాగలేనని రాయపాటి అహ్మద్ పటేల్తో చెప్పినట్లు సమాచారం. మీడియాతో మాట్లాడడానికి రాయపాటి ఇష్టపడడం లేదు.