పురంధేశ్వరికి ప్రమోషన్: కిల్లి కృపారాణికీ చాన్స్
పురంధేశ్వరి, చిరంజీవి, బలరాంనాయక్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, క్లిలి కృపారాణిలకు ప్రధాని నుంచి ఫోన్లు వచ్చినట్లు సమాచారం. సర్వే సత్యనారాయణ, కావూరి సాంబశివ రావు, రేణుకా చౌదరి వంటి వాళ్ల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, చివరకు నలుగురిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. చిరంజీవి శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
బలరాంనాయక్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కిల్లి కృపారాణి కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. తనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవని కావూరి సాంబశివ రావు ఇప్పటికే చెప్పారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని, వ్యక్తిగత పనుల మీదనే ఢిల్లీ వచ్చానని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ చెప్పారు. ఎంపిగా కూడా ప్రజలకు సేవ చేయవచ్చునని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు సర్వే సత్యనారాయణ శుక్రవారం ఢిల్లీకి వచ్చారు.
ఆదివారం పదకొండున్నర గంటలకు మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించునున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఒక్కరికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.