ఈడి ముందుకు వెళ్లని సాయి, నిమ్మగడ్డతో జగపతిబాబు
వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ రోజు రాలేపోతున్నట్లు విజయసాయి రెడ్డి ఈడికి తెలియజేశారు. దీంతో ఆయన హాజరుకు ఈడి మరో తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. వైయస్ జగన్ సంస్థల్లో విదేశీ పెట్టుబడులపై ప్రశ్నించేందుకు ఈడి విజయసాయి రెడ్డిని పిలిచినట్లు సమాచారం. విజయసాయి రెడ్డికి ఢిల్లీకి వెళ్లేందుకు సిబిఐ కోర్టు ఇది వరకే అనుమతి ఇచ్చింది. అయినా ఆయన హాజరు కాలేదు.
ఇదిలావుంటే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయి హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త మ్యాట్రిక్స్ ప్రసాద్ అలియాస్ నిమ్మగడ్డ ప్రసాద్ను సినీ నటుడు జగపతిబాబు కలిశారు. ఆయన వెంట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి చాముండేశ్వరినాథ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు.
జైలులో నిమ్మగడ్డతో వారు గంటకుపై మాట్లాడినట్లు సమాచారం. నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి మిత్రుడని, అందుకే స్నేహపూర్వకంగా కలిశానని జగపతిబాబు చెప్పారు. ఇది వరకు సినీ హీరో అక్కినేని నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్ కలిసిన విషయం తెలిసిందే.