ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా: మెదక్ జిల్లా 'బాట'లో సిఎం
వచ్చే రెండేళ్లలో 30 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సోమవారం ఉదయం మెదక్ జిల్లా, దుబ్బాక నుంచి ఇందిరమ్మబాటను ప్రారంభించారు.
మూడు రోజుల పాటు జరగనుంది. సిద్దపేట మినహా అన్ని నియోజకవర్గాల్లో సీఎం ఇందిరమ్మ బాట సాగనుంది. మరోవైపు ఇందిరమ్మబాట సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి నేతల ముందస్తు అరెస్ట్లు జరుగుతున్నాయి. సిద్దిపేటలో తెరాస నేత రామలింగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత జిల్లాకు ఎన్ని సార్లు వెళ్లానో మెదక్ జిల్లాకు అన్ని సార్లు వచ్చానని ఆయన చెప్పారు. తాను పదిమార్లు మెదక్ జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. తూప్రాన్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేలు చేయాలనే ఉద్దేశంతోనే అన్ని మార్లు ఈ జిల్లాకు వచ్చినట్లు ఆయన తెలిపారు. రూ. 75 కోట్ల అభివృద్ధి పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను సరిజోడుగా నడిపిస్తామని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాలను ఆయన ప్రస్తావించారు.
కాగా ఈనెల 30న నారాయణఖేడ్లో పర్యటించినున్నారు. ఈ సందర్భంగా స్థానిక అనురాధ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో మెదక్ నుంచి నారాయణఖేడ్కు రానుండడంతో సభా ప్రాంగాణానికి సమీపంలో హెలిప్యాడ్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు మట్టి రోడ్డు వేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను, జనరేటర్ను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో దాదాపు 18 వరకు శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు.