వైయస్ ఫ్యామిలీ వేధింపే లక్ష్యం, జగన్ ది లీడర్: ప్రవీణ్
తాను అతి త్వరలో మంచి ముహూర్తం చూసుకొని జగన్ పార్టీలో చేరతానని చెప్పారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం విఫలమైందన్నారు. అధికార కాంగ్రెసు తప్పులు చేస్తే నిలదీయమని ప్రజలు టిడిపిని ప్రతిపక్షంలో కూర్చుండబెడితే చంద్రబాబు వారి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం టిడిపి, కాంగ్రెసు ఏకమయ్యాయన్నారు. తెలుగువాడు, కాంగ్రెసు వ్యతిరేకత అనే రెండు పునాదుల పైన టిడిపిని స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించారన్నారు.
అయితే చంద్రబాబు ఇప్పుడు ఆ రెండింటిని పక్కన పెట్టారని విమర్శించారు. తాను మనస్ఫూర్తిగా జగన్ను సమర్థిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు అసలైన ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్సే అన్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు తేడా లేకుండా పోయిందని, వైయస్ కుటుంబాన్ని వేధించేందుకు, జగన్ను జైలుకు పంపించేందుకే బాబు కాంగ్రెసుతో కలిశారన్నారు. చంద్రబాబు టిడిపి మూల సిద్ధాంతాన్ని మర్చిపోయి కాంగ్రెసుతో కలిసిందన్నారు.
టిడిపి రాష్ట్రాన్ని అనాథగా మార్చిందని, ప్రజా సమస్యలను అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. వైయస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని తాను సమర్థించేది లేదన్నారు. బాబు, కిరణ్ ల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్రం ఓ లీడర్ కోసం ఎదురు చూస్తోందని, ఆ లీడర్ జగన్ అని తాను గట్టిగా నమ్ముతున్నానని, జైలులో ఉన్న ఆయన భవిష్యత్తు ఏమవుతుందో తెలియనప్పటికీ తాను మద్దతు తెలుపుతున్నానని అన్నారు.
తెలుగు వారి ఐక్యత కోసం పుట్టిన టిడిపి 2004లో సమైక్యం అని, 2008లో విడగొట్టాలని, ఆ తర్వాత మళ్లీ సమైక్యం అంటూ ప్రజలను గందరగోళపరుస్తోందన్నారు. అప్పట్లో సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు కూడా చేశామన్నారు. చంద్రబాబు మళ్లీ ఇప్పుడు లేఖ పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగువాడి కోసం, కాంగ్రెసు వ్యతిరేకత కోసం పుట్టిన పార్టీ టిడిపి అనే మూలసిద్దాంతాన్ని బాబు మర్చిపోవడం శోచనీయమన్నారు.
50 శాతం ఓట్లతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 18 శాతం ఓట్లకు పిపోయిందన్నారు. టిడిపి చరిత్రలో కలిసిపోతుందన్నారు. టిడిపి సిద్ధాంతాలతో తాను విభేదిస్తున్నానని చెప్పారు. తాను జగన్ను కలిస్తే పిలిచి మాట్లాడకుండా బహిష్కరించడమేమిటన్నారు. తమ వివరణ ఎందుకు కోరడం లేదన్నారు. జగన్ పార్టీలోకి ఇంకా ఎంతమంది వస్తారో తనకు తెలియదన్నారు. యువత జగన్ వెంట ఉందని, మా సేవలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పూర్తిగా వినియోగిస్తామన్నారు.