జైల్లో జగన్ను కల్సిన టిడిపి ఎమ్మెల్యే: వెంటనే సస్పెన్షన్
ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం అతనిని వెంటనే పార్టీ నుండి సస్పెన్షన్ చేసింది. ప్రవీణ్ కుమార్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా జగన్ వైపు వెళ్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల క్రితం ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని తప్పు పట్టిన ప్రవీణ్ ఆయనపై నిప్పులు చెరిగారు. తెలంగాణపై బాబు ఇచ్చిన లేఖతో ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కానీ కొందరు బయటపడటం లేదన్నారు. బాబు లేఖతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అది అందర్నీ కన్ఫూజన్ చేసే విధంగా ఉందన్నారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెసే సైలెంట్గా ఉన్నప్పుడు లేఖ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందన్నారు. సమైక్యాంధ్ర కోసం తాను పోరాడుతానన్నారు. తన భవిష్యత్తుపై ఇంకా చర్చించలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బాబు లేఖ ఇచ్చారన్నారు. కెబిఆర్ పార్కులో కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసినా, మార్చ్ నిర్వహిస్తున్నా పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఐక్యత కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆ మంచి ఆశయాన్ని అలాగే ఉంచాలని సూచించారు. పార్టీ విధానాలు మార్చుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు అనుకూల మీడియా ఇష్టారీతిగా తాను జగన్ పార్టీలో చేరతానని ఆరోపిస్తోందని ఆ రోజు మండిపడ్డారు. కాగా ప్రవీణ్ రెడ్డి బాటలోనే అమర్నాథ్ రెడ్డి నడిచే అవకాశాలు ఉన్నాయి.