కష్టపడేవారికే పదవులు, అందరూ లబ్ధి పొందారు: సిఎం
ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో రెండోరోజైన మంగళవారం పర్యటించారు. మెదక్ పట్టణంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో పదవులు అందరికీ రావని, కష్టపడి పనిచేసేవారికి పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన ఈ సమావేశంలో అన్నారు.
అనంతరం మెదక్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యేటా విద్యపై 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికే పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు వస్తున్నాయని అన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి ఆసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చిని మంగళవారం ఉదయం ఆయన సందర్శించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మతగురువుల ఆశీస్సులను పొందారు. చర్చి ప్రాముఖ్యను మత గురువురులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు డీకె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హనుమంతరావు, నర్సారెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.