ఎపి, తమిళనాడుకు పొంచి ఉన్న నీలం రంగు తుఫాను
మత్సకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని తీర ప్రాంత జిల్లా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్సకారులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తుఫాను వల్ల ఎక్కడ పంట దెబ్బతింటుంతో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. కొత్తపట్నంలో 10 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముంది. 24 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తమిళనాడు, శ్రీలంకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశముంది. తుఫాను పొంచి ఉండటంతో తమిళనాడులోని తీర ప్రాంతాల్లో విద్యాసంస్థలు తదితరాలను బంద్ చేశారు. నెల్లూరు - నాగపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశముంది. తీరం వెంబటి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గుంటూరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో అధికారులను అప్రమత్తం చేశారు.
కృష్ణపట్నం, మచిలీపట్నం, నాగపట్నం, ఓడరేవు తీరాల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా వివిధ ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 31వ తేది సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-దక్షిణాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మండలాల అధికారులన్ని అఫ్రమత్తం చేశారు.
నీలం తుఫాను ప్రభావం మన రాష్ట్రంలో కంటే తమిళనాడులోనే ఎక్కువగా ఉంటుందని, మనం భయపడాల్సినంత తీవ్రరూపంలో ఉండదని మంత్రి రఘువీరా రెడ్డి మధ్యాహ్నం చెప్పారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసిందన్నారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్సకారులను కోరామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయని చెప్పారు. 040-23456005, 23451043 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని చెప్పారు. ఆయా జిల్లాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూం నెంబర్లు 23308585, 23376256.