టిడిపి నుండి ఎమ్మెల్యే వనిత సస్పెన్షన్: జగన్ వైపుకు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకే ఆమె తన అసంతృప్తిని ప్రకటించిందని చెబుతున్నారు. ఇప్పటికే ఆమెతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మాట్లాడారని తెలుస్తోంది. నవంబరులో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జగన్ వైపుకు వెళ్లేందుకే వనిత విమర్శలు చేస్తోందని భావించిన పార్టీయే ముందుగా స్పందించి ఆమెను తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరించిందని చెబుతున్నారు.
కాగా నాలుగు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన వనిత.. తన నిర్ణయాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రకటిస్తానని చెప్పారు. ఆమెతో పాటు తెలుగుదేశం క్యాడర్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. గోపాలపురం నుంచి మొదటిసారి గత ఎన్నికల్లో వనిత శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. కొవ్వూరు మాజీ శానససభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పెండ్యాల వెంకటకృష్ణా రావు పార్టీకి గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నందువల్లనే వనిత కూడా ఆ బాటలో వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం.
వనిత తండ్రి బాబాజీరావు పెండ్యాల వెంకటకృష్ణా రావు ముఖ్య అనుచరుడు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని, తనపై కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని వనిత ఆ రోజు అన్నారు. తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలిని కూడా తన వెంట వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకుని వెళ్తే ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కృష్ణారావు భావించినట్లు చెబుతున్నారు.