తప్పిన నీలం తుఫాను గండం: మేలేనన్న రఘువీరా
నీలం తుఫానుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాను వల్ల రాష్ట్రానికి మేలే జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 61 మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. తుపాను వల్ల ఏ విధమైన ముప్పు లేదని చెప్పారు.
తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల రైతులకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రఘువీరా రెడ్డి అన్నారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 47 మంది జాతీయ విపత్తు స్పందన బృంద సభ్యులను నెల్లూరుకు పంపినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లుూరు జిల్లాల్లో గతంలో పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా పంపించినట్లు ఆయన తెలిపారు.
రవిచంద్రన్ను చిత్తూరు జిల్లాకు, రాజశేఖర్ను నెల్లూరు జిల్లాకు, వల్లవన్ను ప్రకాశం జిల్లాకు ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి పంట నష్టం జరగలేదని చెప్పారు.
నీలం తుఫాను వల్ల తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెన్నై నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దాన్ని తోడివేసేందుకు జనరేటర్లు వాడుతున్నారు.