దూసుకొస్తున్న నీలం: అప్రమత్తమైన ఎపి, తమిళనాడు
చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. 14 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. పలు కార్యాలయాలు మూతపడ్డాయి. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి నీలం తుఫాను అని నామకరణం చేశారు. ఇది నెల్లూరు - కడలూరు వద్ద ఈ రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నీలం తుఫాను ప్రభావం ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై పడనుంది. గుంటూరు పైన పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే గుంటూరుకు తుఫాను ముప్పు లేదని, ప్రజలు భయానికి లోను కావద్దని అధికారులు చెబుతున్నారు. నిజాంపట్నం ఓడరేవులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా, మచిలీపట్నం వద్ద సముద్రం 200 మీటర్ల ముందుకు వచ్చింది.
నీలం తుఫాను కారణంగా అధికారులు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాడలరేవు సమీపంలో 12 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వారిని రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నీలం తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రకాశం జిల్లా ఓడరేవులో ఏడో ప్రమాదం హెచ్చరిక, కొత్తపట్నంలో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరికొన్ని పోర్టుల్లో ఆరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నీలం తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో ఉదయం నుంచి జోరుగా కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.