తీరానికి చేరువ అవుతున్న నీలం, నష్టం తప్పదు
తుఫాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని అంటున్నారు.తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయి. వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో, ఉత్తర తమిళనాడులో గంటకు 90 కిలో మీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, నెల్లూరు జిల్లాల్లో అలలు 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తున ఎగిసి పడే అవకాశాలున్నాయి. వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారుల అంచనా ప్రకారం - తకుఫాను ప్రభావం తమిళనాడులోని నాగపట్నం, తిరువూరు, తంజావూరు, తిరుచిరాపల్లి, కడలూరు, పాండిచ్చేరి, విల్లుపురం, కాంచీపురం, చెన్నై, తిరువణ్నామలై, వెల్లూరు, తిరువల్లూరు జిల్లాలపై, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలపై పడే అవకాశాలున్నాయి.
తుఫాను వల్ల టెలికమ్యూనికేషన్, విద్యుత్తు, రైలు, రోడ్డు, విమాన యాన వ్యవస్థలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. వచ్చే 72 గంటల్లో తుఫాను బలహీనపడే అవకాశం ఉంది. వచ్చే 36 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.
తమిళనాడు కోస్తా తీరంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో చెట్లు కూలాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలోకి వెళ్లకూడదని జాలర్లను హెచ్చరించారు. సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ప్రజలను తరలించడానికి పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.