బాబు కంట కన్నీరు: కుప్పకూలిన ఎర్రన్నాయుడి కొడుకు
చంద్రబాబు సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్తో కలిసి నిమ్మాడకు చేరుకున్నారు. చంద్రబాబునాయుడు రావడంతోనే ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల రోదన చూసి బాబు తట్టుకోలేక పోయారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలు ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించారు.
లండన్ నుండి వచ్చిన ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు చంద్రబాబు కారులోనే నిమ్మాడకు చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసిన రామ్మోహన్ అక్కడే కుప్పకూలిపోయారు. తమ ప్రియతమ నేత ఎర్రన్నాయుడిని చూసేందుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. కడసారి చూపైనా చూద్దామని పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి తరలి వస్తున్నారు. కాగా రామ్మోహన నాయుడిని తన కారులో తీసుకు వచ్చిన చంద్రబాబు అతను వచ్చే వరకు కుటుంబ సభ్యులతో పాటు విమానాశ్రయంలో కొద్దిసేపు నిరీక్షించారు.