ఎర్రన్నాయుడు దుర్మరణం: శోకసముద్రంలో టిడిపి
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు దుర్మరణం చెందారు. విశాఖపట్నంలో ఓ పెళ్లికి హాజరై ఎర్రన్నాయుడు కారులో తిరిగి వస్తుండగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలు ట్యాంకర్ను ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని వెంటనే శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎర్రన్నాయుడు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఎర్రన్నాయుడు ఆ పార్టీలోనే ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఆయన పని చేశారు. పలు పార్టీ పదవులు చేపట్టారు.
1957 ఫిబ్రవరి 23న జన్మించారు. దాలి నాయుడు, కళావతమ్మల సంతానంలో మొదటి వాడు ఎర్రన్నాయుడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కుమార్తె. ఆయన స్వగ్రామం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామం. శ్రీకాకుళంలో బిఎస్సీ పూర్తి చేసిన ఎర్రన్నాయుడు విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎర్రన్నాయుడుతో పాటు శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షుడు నాయుడు బాబ్జి, మరో నలుగురు ఉన్నారు.
ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. వీరికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎర్రన్నాయుడు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నారు. ఎర్రన్నాయుడు మృతి చెందిన విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం స్వగ్రామం నిమ్మాడలో అంత్యక్రియలు జరుగుతాయి. మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి తరలించారు.
ఎర్రన్నాయుడు మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు, దాడి వీరభద్ర రావు, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్, శోభా హైమావతి, హీరో నందమూరి బాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.