ఎర్రన్నాయుడి మృతి: నివేదిక కోరిన సర్వే, చిరు నివాళి
ఆయన ఏ విషయాన్నైనా స్పష్టంగా సూటిగా చెప్పగలిగిన వ్యక్తి అన్నారు. ఆయన మృతితో ఉత్తర, కోస్తాంధ్ర మంచి నేతను కోల్పోయిందని ఆవేదన చెందారు. ఎర్రన్నాయుడు టిడిపి నేతగా కాకుండా తెలుగు ప్రజల నేతగా ఢిల్లీ స్థాయిలో ఎదిగారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
ఎర్రన్నాయుడు ఎవరితోనైనా స్నేహపూర్వకంగా ఉండేవారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించే వారని, ఉత్తరాంధ్రకు ముఖ్య నేత అన్నారు. ఆయనను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నామన్నారు.
మంచి పార్లమెంటేరియన్ను కోల్పోయామని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఈ మృతి తనను కలిచి వేసిందని, పార్టీలకతీతంగా ప్రజలు ఆయనను గౌరవిస్తారన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎర్రన్నాయుడు మృతదేహానికి చిరంజీవి, యార్లగడ్డ లక్ష్మీ నారాయణలు నివాళులు అర్పించారు. మృతదేహాన్ని చూసి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విలపించారు.
నివేదిక అడిగా
ఎర్రన్నాయుడి ప్రమాదంపై తాను అధికారులను నివేదిక అడిగానని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హైవే అథారిటీ అధికారులది తప్పని తేలితే వారిపై విచారణకు ఆదేశిస్తామన్నారు. హైవే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. తాను కేంద్రమంత్రిని అయినా తెలంగాణను వదిలేది లేదన్నారు.