ఇలా ఐతే బతికేవారు: రోదిస్తున్న ఫ్యామిలీ, టిడిపి
ఆయనతో పాటు మరో నలుగురైదుగురు కారులోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షుడు చౌదరి బాబ్జికి చెందిన మహేంద్ర జైలోలో వారు విశాఖ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షంలో జైలో 80 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వెళుతుండటం కూడా ప్రమాదానికి కారణం అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ముందుసీట్లో కూర్చోకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
ఆ కారణంగానే ట్యాంకర్ని ఢీకొందని చెబుతున్నారు. ప్రమాదం జరిగాక స్థానికంగా ఉన్న వారు ఎర్రన్నాయుడుతో సహా పలువురిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఎర్రన్నాయుడి తలకు బలమైన గాయమైంది. చాతికి కూడా దెబ్బలు తాకాయి. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్లో ఆక్సిజన్ లేకపోవడంతో ప్రాణాలు నిలబెట్టలేక పోయారని అంటున్నారు.
వివాహం అయిపోయాక ఆ రాత్రి సమయంలో కాకుండా ఉదయం బయలుదేరితే తమకు దక్కేవారని రోదిస్తున్నారు. 2004లో నక్స్లల్స్ దాడి జరిగిన నేపథ్యంలో ఆయన చాలాకాలంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే వాడుతున్నారు. అయితే ఈ వివాహానికి మాత్రం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబ్జి కారులో వెళ్లారు. తాను ఎప్పుడూ వెళ్లే కారులో వెళితే ప్రమాదం తీవ్రత తగ్గి ఆయన ప్రాణాలు దక్కించుకునే అవకాశముండేదని, వేరే వాహనంలో ప్రయాణించడం వల్లనే ఇంత ఘోరం జరిగిందని అంటున్నారు. మరోవైపు వాహనంలో ఎయిర్ బ్యాగ్ ఉన్నా ఇంత తీవ్రత ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.