కుడిభుజం పోయింది: విషాదంలో బాబు, యాత్ర రద్దు
పెద్దచింతకుంట నుండి బయలుదేరే సమయంలో బాబు మీడియాతో బాధాతప్త హృదయంతో మాట్లాడారు. ఎర్రన్నాయుడు మరణం దురదృష్టకరమని, ఇలాంటి దుర్వార్త వినడం బాధేస్తుందన్నారు. అతను నిన్న ఉదయం తనతో మాట్లాడారని, చాలా విషయాలు చర్చించామని చెప్పారు.
నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందిన విషయం తెలుసుకొని తట్టుకోలేక పోయానన్నారు. ఎర్రన్నాయుడు ఎంత ఒదిగినా అణిగిమణిగి ఉండే వ్యక్తి అన్నారు. తన కుడిభుజం పోయిందన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే వారన్నారు. వ్యక్తిగత స్వార్థంతో ఎప్పుడూ పని చేయలేదన్నారు. ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్లే మంచి గుణం అన్నారు.
కార్యకర్తలను గౌరవించాలి, వారికి అండగా ఉండాలనుకునే గుణం అని, అందుకే ఎవరి పిలిచినా ఎక్కడకైనా వెళ్లే వారన్నారు. అతనికి రెండు ప్రమాదాలు జరిగాయని, 2004లో నక్సలైట్ల దాడిలో గాయపడ్డారన్నారు. దీనిని తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి చాలా నష్టమన్నారు. మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు. ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన వ్యక్తి అన్నారు.
మళ్లీ వస్తా
తాను వస్తున్నా మీకోసం పాదయాత్రను పవిత్ర కార్యంతో ప్రారంభించానని, అయితే తన సహచరుడు, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయినందు వల్ల పాదయాత్రను ఈ రోజు రద్దు చేసుకుంటున్నానని, సాయంత్రం తిరిగి వచ్చి మళ్లీ కొనసాగిస్తానని చెప్పారు.
సంఘీభావం
ఎర్రన్నాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, టిజి వెంకటేష్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తదితరులు సంఘీభావం తెలిపారు.