బ్రాహ్మనిజం సినిమా అభ్యంతరాలపై 9మందితో కమిటీ
ఎ వుమన్ ఇన్ బ్రాహ్మనిజం చిత్రం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చిత్రంలో బ్రాహ్మణులను, ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా ఉందనే ఆరోపణలు జోరుగా వచ్చాయి. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ చిత్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సినిమాను విడుదల చేయడానికి వీలు లేదని, వీలు చేస్తే అడ్డుకుంటామని బ్రాహ్మణులతో సహా పలు సంఘాలు హెచ్చరించాయి.
దీంతో ప్రభుత్వం ఆ చిత్రం విడుదలను నిలిపి వేయాలని నిర్ణయించింది. చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత చెప్పారు. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి.
పలువురి ఆందోళనతో చిత్ర దర్శక, నిర్మాతలు కూడా ఈ చిత్రంలో వివాదాస్పద సన్నివేశాలను, సంభాషణలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను తొలగించాలని ఇటీవల సూచించారు. దీంతో ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ నివేదిక పూర్తయ్యాక సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.