నీలం ఎఫెక్ట్: బుడమేరుకు పొంచి ఉన్న వరద ముప్పు
నీలం కారణంగా కేవలం ఏడు జిల్లాల్లోనే దాదాపు లక్షకు పైగా ఎకరాలలో పంట నష్టం సంభవించినట్లుగా అంచనా వేస్తున్నారు. కేవలం తూర్పు గోదావరి జిల్లాలోనే దాదాపు 65 వేల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ మీదుగా అల్పపీడన ధ్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
దాదాపు 6500 ఎకరాలలో పంట నీట మునిగింది. కోస్తా తీరం వెంబటి గాలులు 50-55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. బుడమేరుకు వరద నీరు పోటెత్తడంతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. చీమలవాగు, పెదవాగు నుండి నీరు భారీగా వచ్చి చేరుతుంది.
కొండపల్లి పరిసర ప్రాంతాల్లోని వెలగలేరు వద్ద బుడమేరు వాగు నీటిమట్టం 10.5 అడుగులకు చేరింది. అంత నీటిమట్టంతో వాగు పొంగిపొర్లుతుండటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. వెలగేరు రెగ్యూలేటర్ వద్ద 11 షట్టర్లు ఓపెన్ చేసి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మిలేరుకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో 25వేల క్యూసెక్కులు ఉంటే, ఓట్ ప్లో 14వేల క్యూసెక్కులు ఉంది. ఏలూరుకు వరద ముప్పు పొంచి ఉంది.
ఎర్రకాలువలో నీటి మట్టం బాగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా వచ్చిన సుడిగాలి స్థానికులను భయాందోళనలో ముంచింది. ఈ గాలి ధాటికి వృక్షాలు విరిగాయి, రేకుల ఇళ్లు, పూరి గుడిసెలు నేలకొరిగాయి. సత్తుపల్లి - అశ్వారావుపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థలు స్తంభించాయి. గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరటంతో నలభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ భారీ వర్షాలు దక్షిణ మధ్య రైల్వేపై భారీగానే పడింది. కొండపల్లి-మధిర, కాజీపేట-డోర్నకల్ ప్యాసింజర్, విజయవాడ-కాజీపేట, పద్మావతి ఎక్సుప్రెస్ ఇలా పలు రైళ్లు రద్దయ్యాయి. రైల్వే ట్రాకులకు మరమ్మతులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. కృష్ణా జిల్లా గుడివాడ బస్టాండ్ నీటిలో మునిగిపోయింది.