చరిత్రలో చిరంజీవిగా: ఎర్రన్నాయుడిమృతిపై పురంధేశ్వరి
ఆయన పార్టీలకతీతంగా అందరితో కలుపుగోలుగా ఉండే వారన్నారు. తమ కుటుంబానికి ఎర్రన్నాయుడుతో సత్సంబంధాలున్నాయని చెప్పారు. ఆయన చిన్న వయస్సులోనే ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యకు వెళ్లారన్నారు. ఇరవై అయిదేళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. కేంద్రమంత్రి స్థాయికి ఎదిగినప్పటికీ ఆయనది ఒదిగి ఉండే వ్యక్తిత్వమన్నారు. తనను నమ్ముకున్న ప్రజల కోసం ఆయన పని చేశారన్నారు. ప్రజలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే వారని చెప్పారు.
కాగా శుక్రవారం తెల్లవారుజామున రణస్థలి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికారికంగా శనివారం ఉదయం ముగిశాయి. నిమ్మాడ వ్యవసాయక్షేత్రంలో అధికారికంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్లు పేల్చారు. నిమ్మాడ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
ఎర్రన్నాయుడు అంతిమయాత్రకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు, నామా నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి, వల్లభనేని వంశీ, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, మంత్రులు బాలరాజు, శత్రుచర్ల విజయరామ రాజు, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, బాబు తనయుడు నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.