రెచ్చగొట్టే పార్టీలకు బహిష్కరణ: పరిపూర్ణానందస్వామి
గోరంట్లలోని మాధవ నాయుడు ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి హిందువు కూడా హిందుత్వాన్ని రక్షించాలని సూచించారు. ప్రపంచంలోని ఏ దేశంలో కంటే మన దేశంలోనే ముస్లింలకు భద్రత ఉందని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు మతాన్ని రెచ్చగొడితే వారిని బహిష్కరించాలని, వారి మాటలు వినవద్దని సూచించారు. తాను అవగాహన కల్పించేందుకే రథయాత్ర చేస్తున్నానని చెప్పారు.
కాగా ఆయన తలపెట్టిన రథయాత్ర గురువారం అనంతపురం జిల్లా కదిరి నుండి ప్రారంభమైంది. ఆయన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతి ఆదివారం గంటసేపు దళితులతో ప్రత్యేక పూజలు చేయించాలని పరిపూర్ణానంద ఆలయ కమిటీని కోరారు. అందుకు ఆలయ కమిటీ సానుకూలంగా స్పందించింది.
ఆలయంలోకి ఎవరైనా రావొచ్చునని, అయితే పరిపూర్ణానంద విజ్ఞప్తి మేరకు పూజలు చేయిస్తామని చెప్పారు. అనంతరం పరిపూర్ణానంద తన రథయాత్రను ప్రారంభించారు. స్థానిక వాల్మికీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హిందూమతం అన్ని మాతాలను ఆదరిస్తుందని, ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. నోస్ట్రడోమస్ చెప్పినట్లుగా 2014 నాటికి దేశ వైభవం ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయమన్నారు. హిందూ మతం ఇతర మతాలను సోదరభావంతోనే చూస్తుందన్నారు. హిందువుల అవగాహనకే తాను యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.