108 ఆలస్యంవల్లే ఎర్రన్నాయుడి మృతి: షర్మిల విమర్శ
అదే సమయంలో ఆమె మాట్లాడుతూ.. 108 వాహనం సకాలంలో రాక పోవడం వల్లనే ఎర్రన్నాయుడు మృతి చెందాడన్నారు. వాహనం సమయానికి వచ్చి ఉంటే ఎర్రన్నాయుడు బతికి ఉండేవారన్నారు. ఎర్రన్నాయుడి లాగా ఎంతోమందిని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని షర్మిల విమర్శించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 108 వాహనం ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని దించే శక్తి ఉన్నప్పటికీ దింపి వేయడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం కాంగ్రెసు ప్రభుత్వంతో కుమ్మక్కయిందన్నారు. అవిశ్వాసం పెట్టక పోవడం కంటే కుమ్మక్కు ఏముంటుందని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. సమయం వచ్చనప్పుడు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు.
కుట్ర పూరితంగా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై కేసులు వేసిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ఆ దేవుడు తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి మారెప్ప విశాఖపట్నంలో అన్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా రాబోయేది జగన్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.