కావూరి అసంతృప్తి: నేరుగా రంగంలోకి దిగిన సోనియా
ఈ రోజు(ఆదివారం) తనను కలవాల్సిందిగా సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్న కావూరికి సూచించినట్లుగా సమాచారం. ఇవాళ ఏ సమయంలోనైనా ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రామ్ లీలా మైదానంలో కాంగ్రెసు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. బిజీలో ఉన్న సోనియాను కావూరి కార్యక్రమం అనంతరం కలిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కక పోవడంతో కావూరి తీవ్ర అసంతృప్తికి లోనై అధినేత్రికి రాజీనామా లేఖలు పంపిన విషయం తెలిసిందే. లోకసభ సభ్యత్వానికి, మిగతా స్థాయి సంఘం పదవులకు, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సమన్వయ కమిటీకి ఇలా అన్ని పదవులకు రాజీనామా చేశారట. ఒక్క కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మినహా అన్ని పదవులకు రాజీనామా సమర్పించిన ఆయన వాటిని నేరుగా ఆయా కార్యాలయాలకు కాకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
అలక వహించిన కావూరితో ఈ నెల 6న కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, దిగ్విజయ్ సింగ్ కూడా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత కావూరి పార్టీలో కొనసాగుతారా లేరా అనే అంశం కూడా తేలిపోతుందనే వార్తలు వచ్చాయి. అయితే దిగ్విజయ్ కంటే ముందే సోనియా ఆయనకు పరిస్థితి వివరించి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం.