ఈ సిఎంను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదు: బాబు
2004లో కాంగ్రెసుకు ఓటేసి ప్రజలు కష్టాల పాలయ్యారని, 2009లో ఓటేసి సుడిగుండంలో పడ్డారని అంటూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కాదని ఓటేస్తే అగ్నిగుండలో పడతారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలపై వడ్డీలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెసు వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వచ్చి మీకు అండగా ప్రభుత్వం ఉందని భరోసా ఇవ్వాలని, అలాంటిది రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇంతవరకు పర్యటనకు రాలేదని చంద్రబాబు విమర్శించారు. బాధితులను పరామర్శించడానికి ముందు సోమవారం ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టాన్ని అంచనావేయలేకపోవడం వల్లే రైతులకు పరిహారం అందడం లేదని ఆయన ఆరోపించారు.
రైతులకు పంట భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ విధానాల మధ్య రైతులు చితకిపోతున్నారని, రాష్ట్రాన్ని ప్రభుత్వం భ్రష్టుపట్టించందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సమస్యల సుడిగుండంలో నెట్టి, బలప్రదర్శన కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోందని చంద్రబాబు అన్నారు. నీలం తుపాన్తో రాష్ట్రం అతలాకుతలం అయితే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ రాష్ట్ర పర్యటనకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.
గత 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మాత్రం కంటితుడుపు చర్యలు చేపడుతూ ప్రజల్ని మభ్యపెట్టిందేకానీ, ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. ఇంతవరకు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకున్న చర్యలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.